లిస్బన్: అట్లాంటిక్ సముద్రంలో బోటు మునిగిన ఘటనలో 62 ఏళ్ల నావికుడు ఆ బోటు కిందే సుమారు 16 గంటల పాటు సజీవంగా ఉన్నాడు. పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచి సుమారు 12 మీటర్ల పొడుగు ఉన్న బోటులో అతను బయలుదేరాడు. అయితే సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ కావడంతో అతను కోస్టుగార్డులకు సిగ్నల్స్ ఇచ్చాడు. రాత్రి పదిన్నర సమయంలో ఆ బోటు నుంచి సంకేతాలు అందాయి. అయితే స్పెయిన్ కోస్టుగార్డులు ఆ బోటు వద్ద చేరుకున్నా.. చీకటి కావడంతో ఏమీ చేయలేకపోయారు. సముద్రం కూడా తీవ్ర ఆటుపోట్లకు లోనవడం వల్ల నిస్సహాయంగా ఉండిపోయారు. ఆ వ్యక్తిని కాపాడడం అసాధ్యం అనుకున్నారు. రెస్క్యూ నౌకలోని అయిదు మంది డైవర్లు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్లు వచ్చినా చీకటి వల్ల రెస్క్యూ ఆపరేషన్ సరిగా జరగలేదు. కానీ బోటుకు కొన్ని బెలూన్లు కట్టడంతో అది మునగకుండా ఉండిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఇద్దరు డైవర్లు వెళ్లి అతన్ని రక్షించారు. అయితే ఆ వ్యక్తి ఎయిర్ బబుల్తో బోటు కింద సజీవంగా ఉన్నట్లు గుర్తించారు.