Human Trafficking | పారిస్, డిసెంబర్ 22: దుబాయ్ నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో మధ్య అమెరికాలోని నికరాగ్వాకు వెళ్తున్న ఓ విమానాన్ని ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో ఫ్రాన్స్లో అధికారులు తమ అధీనంలోకి తీసుకొన్నారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అందిన సమాచారంతో… ఇంధన రీఫిల్లింగ్ కోసం వట్రీ ఎయిర్పోర్టులో దిగిన విమానాన్ని అధికారులు నిర్బంధించారని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం పేర్కొన్నది.
ప్రయాణికులంతా హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు కావొచ్చని అభిప్రాయపడింది. దీనిపై దేశ వ్యవస్థీకృత నేరాల వ్యతిరేక యూటిన్ ‘జునాల్కో’ దర్యాప్తు చేపట్టిందని తెలిపింది. అసలు ఈ విమానం ఎక్కడకు, ఎందుకు వెళ్తుంది? అనే కారణాలను తేల్చేందుకు విచారణ ప్రారంభం అయిందని ఈస్టర్న్ మార్నే రీజియన్ స్థానిక అధికారులు వెల్లడించారు. రొమానియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న ఈ ఏ340 విమానం ఇంధన రీఫిల్లింగ్ కోసం దిగిందని పేర్కొన్నది. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించే ప్లాన్లో భాగంగా భారతీయ ప్రయాణికులు ముందు మధ్య అమెరికా వెళ్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, వట్రీ ఎయిర్పోర్టును ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏరియాగా మార్చి పడుకొనేందుకు బెడ్లు సదుపాయం కూడా కల్పించినట్టు మార్నే పర్ఫెక్ట్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నది.