కోబె: ఓ మూడంతస్తుల అపార్టుమెంటులో అర్ధరాత్రి 1.35 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో రాజుకున్న మంటలు తర్వాత రెండో అంతస్తుకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వాళ్లు ప్రాణాలుతో బయటపడ్డారు.
జపాన్ దేశంలోని కోబె పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గురైన అపార్టుమెంటులో అంతా రోజుకూలీలు, వృద్ధులే ఉంటారని అక్కడి అధికారులు తెలిపారు. మొదటి అంతస్తులో మంటలు అంటుకోగానే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారని, చివరకు ఉన్న 8 మందికి మాత్రమే మంటలు అంటుకున్నాయని చెప్పారు.
ప్రమాదం గురించి తెలిసి అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే అందరూ అపార్టుమెంటు బయటికి వచ్చేశారని, తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులను మాత్రమే రెస్క్యూ సిబ్బంది బయటికి తీసుకొచ్చారని తెలిపారు. మంటలు ఆర్పిన తర్వాత అక్కడ నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు.