
సిడ్నీ: స్కూల్ వార్షిక వేడుకలో విషాదం జరిగింది. బలమైన గాలులకు జంపింగ్ క్యాస్టల్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. దీంతో అందులో ఆడుతున్న నలుగురు పిల్లలు ఎత్తు నుంచి కిందపడి మరణించగా పలువురు చిన్నారులు గాయపడ్డారు. ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రంలో ఈ విషాద ఘటన జరిగింది.
బుధవారం ఉదయం డెవాన్పోర్ట్లోని హిల్క్రెస్ట్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కొందరు పిల్లలు గాలితో నింపిన కోటపైకి ఎక్కి ఆడుతున్నారు. ఇంతలో గాలి పెద్దగా వీయడంతో అది పది మీటర్ల ఎత్తుకు లేచింది. ఈ నేపథ్యంలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు పది మీటర్ల ఎత్తు నుంచి కింద పడి చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో నలుగురు చిన్నారుల పరిస్థితి సీరియస్గా ఉన్నదని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హృదయ విదారక సంఘటనగా అభివర్ణించారు. ‘ఆ చిన్న పిల్లలు అప్పటి వరకు వారి కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. ఏడాది చివరి సమయంలో ఇది చాలా భయంకరమైన విషాదానికి దారి తీసింది. అందరి హృదయాలను కలిచివేసింది’ అని మీడియాతో అన్నారు. కాగా, ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
Four children were killed and several more badly injured in Australia after strong winds lifted an inflated jumping castle into the air during end-of-year school celebrations, causing them to fall 10 meters https://t.co/UydLFcS4Nk pic.twitter.com/QoVEbD4PFJ
— Reuters (@Reuters) December 16, 2021