Mike Pompeo | పాకిస్తాన్ సరిహద్దులోని బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది నిజమే అని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో తెలిపారు. అప్పుడు భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షన అణు దాడికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి తెలియదన్నారు. ఈ విషయాలను ఆయన తన తాజా పుస్తకంలో వెల్లడించారు. భారత్లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ విషయాలను తనతో పంచుకున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా, మైక్ పాంపియో చేసిన వాదనలపై అమెరికా హోం శాఖ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.
అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించి 2019 ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అమెరికా-నార్త్ కొరియా శిఖరాగ్ర సమావేశంలో సుష్మాస్వరాజ్ తనతో చెప్పిన విషయాలను ఈ పుస్తకంలో వివరంగా రాశారు. బాలాకోట్పై తాము సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో వారు తమ ఆణ్వాయుధాలను బయటకు తీసి దాడి చేసేందుకు సిద్ధమయ్యారని కూడా సుష్మా చెప్పారని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను ఎదుర్కొనేందుకు భారత్ కూడా సన్నాహాలు చేసినట్లు ఆయన తెలిపారు.
2019 ఫిబ్రవరిలో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం అణు దాడికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి కూడా తెలియదని తాను అనుకుంటున్నానన్నారు. ఎందుకిలా అనే ప్రశ్నకు సరైన సమాధానం కూడా తనకు తెలియదని, అయితే రెండు దేశాలు మాత్రం అణు దాడికి చాలా దగ్గరగా వచ్చాయన్న విషయం తనకు తెలుసునని తన పుస్తకంలో వెల్లడించారు. ఒకవైపు ఉత్తర కొరియా అణ్యాయుధాలపై, మరోవైపు ఇండియా-పాక్ మధ్య కశ్మీర్ విషయంపై అణు ఆయుధాల దాడిపై జరిగిన చర్చలను తన జీవితంలో మరిచిపోని రోజని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ చెప్పిన విషయాల మేరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాకు ఫోన్ చేయగా.. అణ్వాయుధ దాడికి సిద్ధమవుతున్న వార్తలు అవాస్తవమని చెప్పారని మైక్ పాంపియో తెలిపారు.