ఇమ్రాన్ ఖాన్ తన దేశ భక్తిని చాటుకోబోయి.. నవ్వుల పాలయ్యారు. తాను ఎంత దేశ భక్తుడినో చెప్పాలనుకొని… గాడిదతో పోల్చుకున్నారు. ఇంకేముంది.. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పాకిస్తాన్కు చెందిన ఓ జర్నలిస్టు ఇమ్రాన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా… తాను బ్రిటిషర్ను కానని, గాడిద గాడిదలాగా ఎలాగైతే ఉంటుందో… తానూ అలాగే ఉండిపోతానని వ్యాఖ్యానించారు.
బ్రిటన్ నా సొంత దేశమని ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే నేను పాకిస్తాన్ వ్యక్తిని కాబట్టి. ఏం జరిగినా సరే… నేను బ్రిటిషర్ని మాత్రం కాను. ఓ గాడిదపై చారలు గీసినంత మాత్రాన అది కంచర గాడిద అయిపోతుందా? గాడిద… గాడిద లాగే ఉండిపోతుంది కదా… నేను కూడా అంతే అంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
ఇక ఇమ్రాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా యూజర్స్ తెగ ఆడేసుకుంటున్నారు. ఆయనకు 69 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్వీయ సాక్షాత్కారం కలిగిందా? అంటూ పేర్కొన్నారు. ఇక.. ఇమ్రాన్లో ఆత్మన్యూనతా భావం పెరిగిందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇక.. యూకేలో ఆయన ఇమడలేకే… పాకిస్తాన్కు వచ్చేశారని మరొకరు ఎద్దేవా చేశారు. యూకే ఇమడలేక ఇమ్రాన్ పాక్కు వచ్చేస్తే.. పాకిస్తాన్ సమాజంలో ఇమడలేక నవాజ్ షరీఫ్ యూకేలోనే ఉండిపోతున్నారని మరొకరు పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఎందుకిలా మాట్లాడారు?
ఇమ్రాన్ ఇప్పుడు యూకే ప్రస్తావన ఎందుకు తెచ్చారు? ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన తర్వాత… ఆయనపై ప్రస్తుత పాక్ సర్కార్ కేసులు పెడుతుందన్న ఊహాగానాలు విపరీతంగా ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోడానికి ఆయన దేశం వీడి వెళ్తారని, యూకేలో తలదాచుకుంటారన్న వార్తలు కూడా ఒకానొక దశలో వచ్చాయి. అంతేకాకుండా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్లో తలదాచుకుంటున్నారు. ఈ కారణంగానే ఆయనను విమర్శించడానికి కూడా ఇమ్రాన్ ఇలా అన్నారన్న కోణమూ ఉంది.