ఇస్లామాబాద్/దుబాయ్, ఫిబ్రవరి 5: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్తో బాధపడుతున్న ఆయన.. దుబాయ్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేసినట్టు పాకిస్థాన్కు చెందిన జియో టీవీ వెల్లడించింది. ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చేందుకు పాక్ ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానాన్ని దుబాయ్కు పంపనున్నట్టు తెలిపింది. దేశ విభజనకు ముందు 1943, ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్.. విభజన అనంతరం కుటుంబంతో కలిసి కరాచీ వెళ్లిపోయారు. 1968లో సెహబా ముషారఫ్ను పెండ్లి చేసుకొన్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
1964లో పాకిస్థాన్ ఆర్మీలో చేరిన ముషారఫ్.. 1965 ఇండో-పాక్ యుద్ధంలో సెకండ్ లెఫ్ట్నెంట్గా పనిచేశారు. 1990ల్లో మేజర్ జనరల్గా పదోన్నతి పొందారు. డిప్యూటీ మిలటరీ సెక్రటరీ, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. సరిహద్దుల్లోని సియాచిన్ ప్రాంతంలో భారత్ పట్టును సహించలేకపోయిన ముషారఫ్.. కార్గిల్ చొరబాటు చేయాలని 1988-89లో అప్పటి పాక్ ప్రధాని బెనజీర్ భుట్టోకు ప్రతిపాదించారు. అప్పటికే వీరిద్దరు అత్యంత సన్నిహితులు. అయితే, యుద్ధ భయంతో బెనజీర్ వెనక్కి తగ్గారు. అయితే, ముషారఫ్ ఆదేశాలతో 1999 మార్చి నుంచి మే మధ్య పాక్ సైన్యం కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా చొరబడింది. దీంతో భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు తెలియకుండా భారత్తో ముషారఫ్ యుద్ధం చేయటం గమనార్హం. భారత ప్రధాని వాజపేయి నవాజ్కు ఫోన్ చేస్తే యుద్ధం గురించి తనకు తెలియదని బదులిచ్చారు.
కార్గిల్ యుద్ధ సమయంలో ముషారఫ్, నవాజ్ షరీఫ్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ముషారఫ్ను గద్దె దించాలని నవాజ్ నిర్ణయించుకొన్నారు. ఆ విషయాన్ని తెలుసుకొన్న ముషారఫ్.. 1999 అక్టోబర్లో సైనిక తిరుగుబాటు చేసి నవాజ్ను గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు. 2001లో తానే అధ్యక్షుడినని ప్రకటించుకొన్నారు. 2007లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించి, నాలుగు రోజుల ముందే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. సుప్రీం చీఫ్ జస్టిస్ ఇఫ్తికర్ను తొలగించి, తనకు అనుకూలుడైన అబ్దుల్ హమీద్ దోగార్ను నియమించి, తన ఎన్నికకు ఆమోదముద్ర వేయించుకొన్నారు.
2008లో అధికారంలో ఉన్న పార్టీలు ముషారఫ్కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధం కావటంతో.. దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏర్పాటైన ప్రభుత్వం ముషారఫ్ను అరెస్టు చేసేందుకు సిద్ధం అయ్యింది. రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు దేశద్రోహం కేసు మోపింది. దీంతో 2008 నవంబర్లో లండన్కు పారిపోయారు. తర్వాత 2013లో పాక్కు తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆయనపై అనర్హత వేటు పడింది. అరెస్టుకు కోర్టు ఆదేశాలివ్వటంతో పారిపోయి దాక్కొన్నారు. పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావటంతో అనారోగ్య సమస్యల పేరుతో 2016లో దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే తలదాచుకొంటున్నారు.