బీజింగ్: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇండోపాక్ మధ్య శాంతి నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా(China) చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాన్నాళ్ల నుంచి ఇండోపాక్ యుద్ధాన్ని ఆపినట్లు చెబుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ట్రంప్ తరహాలోనే డ్రాగన్ దేశం చైనా కూడా ఆ కామెంట్ చేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య చేపట్టింది. అయితే రెండు దేశాల డీజీఎంవోల చర్చల తర్వాతే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్లు భారత్ పేర్కొన్నది. పాక్తో జరిగిన సమరంలో మూడవ దేశ పాత్ర లేదని చెప్పింది. కానీ ఇండోపాక్ మధ్య శాంతిని నెలకొల్పడంలో తాము కూడా పాత్ర పోషించినట్లు ఇప్పుడు చైనా చెప్పడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంక్షోభాలను పరిష్కరించేందుకు శాంతిదూత పాత్రను చైనా పోషించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇండోపాక్ యుద్ధమే కాదు మయన్మార్, కంబోడియా-థాయ్ల్యాండ్, ఇరాన్ న్యూక్లియర్ సమస్యను కూడా పరిష్కరించినట్లు చైనా మంత్రి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో యుద్ధాలు, సీమాంతర దాడులు జరిగాయన్నారు. రాజకీయ అనిశ్చితి పెరిగిందన్నారు. శాంతి స్థాపన చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని, దీని కోసం ఆ సమస్యల మూలాలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశామన్నారు. బీజింగ్లో జరిగిన ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ చైనా ఫారిన్ రిలేషన్స్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది తాము మధ్యవర్తిత్వం వహించిన సమస్యాత్మక కేసుల్లో ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతలు కూడా ఉన్నట్లు మంత్రి వాంగ్ యి చెప్పారు. హాట్స్పాట్ ప్రాంతాల పట్ల చైనా తన విధానాన్ని అమలు చేసిందన్నారు. నార్తర్న్ మయన్మార్ సమస్య పరిష్కారంలో, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, ఇండో పాక్ ఉద్రిక్తతలు, పాలస్తీనా-ఇజ్రాయిల్ , కంబోడియా-థాయ్ల్యాండ్ సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా మంత్రి తెలిపారు.