న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కింలోని నాకూ లా పాస్ దగ్గర చైనీస్ ఆర్మీ రోడ్లు, కొత్త పోస్టులు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజ్లు బయటపెట్టాయి. గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతల తర్వాత నాకూ లా ప్రాంతంలో చైనీస్ ఆర్మీ కార్యకలాపాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో డోక్లాంతోపాటు నాకూ లాలో కూడా ఇండియా, చైనా జవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాజా శాటిలైట్ ఇమేజ్లను ఇండియా టుడే టీవీ బయటపెట్టింది.
ఈ నెల 12వ తేదీ వరకూ కూడా నాకూ లా పాస్ దగ్గర చైనా ఆర్మీ కార్యకలాపాలు ఉన్నట్లు ఈ శాటిలైట్ ఇమేజ్లు స్పష్టం చేస్తున్నాయి. ఆ రోజు ఉదయం ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ వాహనాలు, కొత్త క్యాంపులు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోల్లో తేలింది. గతేడాది సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలో తీసిన శాటిలైట్ ఇమేజ్లో ఎలాంటి నిర్మాణాలు కనిపించకపోగా.. తాజా చిత్రాల్లో చైనా వాహనాలు, క్యాంపుల వంటి నిర్మాణాలు కనిపించాయి. కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నట్లు కూడా వీటిలో స్పష్టంగా కనిపించింది.