మాస్కో: ఉక్రెయిన్పై దాడికి రష్యా సర్వసన్నద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పలు దేశాల రాయబార కార్యాలయాలు కూడా ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు ఉక్రెయిన్కు విమానాలు నిలిపివేశాయి. మరికొన్ని సంస్థలు విమానాలను దారి మళ్లించాయి. దీంతో ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులతోపాటు ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్కు వచ్చే వారు పలు విమానాశ్రయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
కాగా, ఉక్రెయిన్పై రష్యా దాడిని నివారించేందుకు అమెరికా చాలా ప్రయత్నాలు చేస్తున్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలుసార్లు నేరుగా ఫోన్లో మాట్లాడారు. దాడి వల్ల మానవాళికి చాలా నష్టం జరుగుతుందని హితవు పలికారు. సమస్యను పరిష్కరించే మార్గాలపై దృష్టిసారించాలని కోరారు. ఒకవేళ రష్యా దాడి వైపే మొగ్గితే ఆర్థిక ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు ఉక్రెయిన్పై దాడి కోసం పొరుగున ఉన్న బెలారస్లో రష్యా తన సైన్యాన్ని భారీగా మోహరించిందని అమెరికా రక్షణ నిఘా వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 16 లేదా ఆ తర్వాత ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగే అవకాశమున్నదని పేర్కొన్నాయి. అయితే ఒకవైపు యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైన రష్యా యథావిధిగా దీనిని తోసిపుచ్చింది. పశ్చిమ దేశాలు ఈ అంశాన్ని పెద్దగా చేస్తున్నాయని విమర్శించింది.