Five Major Earthquakes | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సోమవారం వరుసగా మూడు అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8, 7.7, 7.6 గా నమోదైంది. ఈ భారీ భూకంపాల ధాటికి ఇప్పటికే 4,300 పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ భూప్రకంపనల కారణంగా సుమారు ఐదువేలకు పైగా భారీ భవంతులు పేకమేడల్లా క్షణాల్లో కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, గడిచిన 20 ఏండ్లలో అత్యధికంగా ప్రాణ నష్టం, ప్రకృతి వినాశనం సృష్టించిన భూకంపాల్లో ఇదొకటని పర్యావరణ నిపుణులు, భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఇరవై ఏండ్లలో భారీ వినాశనానికి కారణమైన ఐదు భూకంపాల వివరాలు మీకోసం..
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో 2004లో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 9.2 తీవ్రతగా నమోదైంది. ఈ విపత్తులో సుమారు 2,27,899 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూప్రకంపనలు ఇండోనేషియాలోనే కాకుండా శ్రీలంక, భారత్, థాయ్లాండ్తో సహా ఇతర దేశాలను కూడా తాకాయి. హిందూ మహాసముద్రంలో సంభవించిన ఈ భూకంపం 15-30 మీటర్ల ఎత్తు వరకు వినాశకరమైన సునామీలకు దారి తీసింది.
2008 సంవత్సరంలో చైనాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. సిచువాన్ ప్రావిన్స్లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టురు స్కేలుపై 7.9గా నమోదైంది. ఈ భారీ భూకంపం ధాటికి 87 వేల మంది మరణించగా.. సుమారు 3,70,000 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జపాన్లో 2011 సంవత్సరంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి తొహకు ఏరియా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.1 గా నమోదైంది. భూకంపం కారణంగా భారీ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఈ విధ్వంసంలో 15,899 మంది చనిపోయినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
నేపాల్ను 2015 సంవత్సరంలో భారీ భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదైంది. ఈ దుర్ఘటనలో సుమారు 8,964మంది ప్రాణాలు కోల్పోయారు. 21వేల మందికి గాయాలయ్యాయి. భారీ భూకంపం కారణంగా 35లక్షల మంది నిరాశ్రయులైనట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 1934 తర్వాత నేపాల్లో నమోదైన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం ఇదే అని తెలిపింది. దీంతో 2015 నేపాల్ ప్రజలకు విషాదాన్ని మిగిల్చిన సంవత్సరంగా నిలిచింది.
వీటి తర్వాత తాజాగా తుర్కియేలో సంభవించిన భూకంపం అత్యంత శక్తివంతమైందిగా నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు మరికొన్ని ప్రాంతాలకు భూకంపాలు వణికించాయి. 2013లో పాకిస్థాన్లోనూ 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి వేలాది ఇళ్లు నేలకూలాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2021 ఆగస్టు 14న హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి వినాశనంలో రెండు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 13వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటితోపాటు ఆఫ్ఘానిస్థాన్, ఇటలీ, మెక్సికో, ఇరాన్, న్యూజిలాండ్, చిలీ తదితర దేశాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. అయితే వీటన్నింటితో పోలిస్తే.. పైన చెప్పిన ఐదు భూకంపాలు తీవ్ర ప్రభావం చూపినట్లు పర్యావరణ నిపుణులు, భూగోళ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు.