North Korea | ఉత్తర కొరియా (North Korea) రాజధాని ప్యాంగ్యాంగ్ (Pyongyang ) నగరంలో అధికారులు ఐదు రోజుల లాక్డౌన్ విధించారు. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం నుంచి ఆదివారం వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. ఈ మేరకు దక్షిణ కొరియా రాజధాని సియోల్ కేంద్రంగా పనిచేసే నార్త్ కొరియాకు చెందిన ఎన్ కే న్యూస్ ఈ వివరాలను ప్రచురించింది.
నగరంలో లాక్డౌన్ గురించి ప్యాంగ్యాంగ్ పౌరులకు ముందే సమాచారం ఉందని, మంగళవారం అక్కడి ప్రజలు పెద్ద మొత్తంలో సరకులు కొనుగోలు చేసి తీసుకెళ్లడం కనిపించిందని ఎన్కే న్యూస్ తన కథనంలో వెల్లడించింది. అయితే, దీనిపై దక్షిణ కొరియా అనుమానం వ్యక్తం చేసింది. అక్కడి ప్రభుత్వ నోటీసుల్లో శ్వాసకోశ వ్యాధి అని పేర్కొన్నప్పటికీ అది కరోనానే అని సందేహం వ్యక్తం చేసింది. ప్యాంగ్యాంగ్లో లాక్ డౌన్ విధించడం చూస్తుంటే.. నార్త్ కొరియాలో కరోనా కల్లోలం భారీగానే ఉన్నట్లుందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.