వెల్లింగ్టన్: కరోనాపై ఎడతెగని పోరాటం చేసి విజయం సాధించిన న్యూజిలాండ్( New Zealand )లో ఆరు నెలల తర్వాత స్థానికంగా సంక్రమించిన తొలి కేసు నమోదైంది. ఈ కేసును డెల్టా వేరియంట్గా అనుమానిస్తున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మూడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. డెల్టా వేరియంట్ పరిస్థితిని మొత్తం మార్చగలదని ఆమె అన్నారు. కరోనాపై పూర్తిగా విజయం సాధించకపోతే ఏం జరుగుతుందో మనం ప్రపంచమంతా గమనిస్తే తెలుస్తుంది అని జెడిండా చెప్పారు.
ఈ కేసు ఆక్లాండ్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ కరోనా కేసు ఎలా నమోదైందన్నదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకు రాలేదు. ఫిబ్రవరి 28 తర్వాత న్యూజిలాండ్లో నమోదైన తొలి కేసు ఇదే. 50 లక్షల జనాభాలో ఉన్న న్యూజిలాండ్లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా కేవలం 26 మంది మాత్రమే మరణించారు. ఈ మహమ్మారిని వాళ్లు కట్టడి చేసిన విధానంపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి.