Terror attack fear | పాకిస్తాన్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అగ్రరాజ్యం అమెరికా భయపడుతున్నది. పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం అక్కడి తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. రెండ్రోజుల క్రితం ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడి అనంతరం కొందరు వ్యక్తులు మరో ఉగ్రదాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందిందని అమెరికా హెచ్చిరించింది. మరీ ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన మారియట్ హోటల్ను వెంటనే ఖాళీ చేయాలని తమ పౌరులకు సూచనలు జారీ చేసింది. ఇస్లామాబాద్లోని మారియట్ హోటల్పైనే రెండ్రోజుల క్రితం ఉగ్రదాడి జరిగింది. సెలవు దినాల్లో పాక్లోని ఏ హోటల్కు వెళ్లవద్దని అమెరికా తన పౌరులను ఆదేశించింది.
డిసెంబర్ 23 శుక్రవారం నాడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఫిదాయీల దాడి జరిగింది. ఇందులో ఒక పోలీసు మరణించాడు. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఆత్మాహుతి దాడి అనంతరం పాక్ పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్ల ఇస్లామాబాద్లో మరో పెద్ద ఉగ్రదాడి తప్పిందని అమెరికా అధికారులు చెప్తున్నారు. దాడి జరగడానికి ఒక రోజు ముందు భద్రతా కారణాల దృష్ట్యా 2,024 అనుమానాస్పద వ్యక్తులు, మోటార్ సైకిళ్లు, వాహనాలను తనిఖీ చేసినట్లు ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు. గత వారంలో పాకిస్తాన్లోని బన్నూ జిల్లాలో ఆర్మీ కౌంటర్ టెర్రరిజం సెంటర్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇస్లామాబాద్తో పాటు పాకిస్తాన్లోని పలు పెద్ద నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.
2008 లో కూడా ఇదే మారియట్ హోటల్పై తీవ్రవాద దాడి జరిగింది. ఇందులో 63 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మంది గాయపడ్డారు. దాడి సమయంలో చెత్త ట్రక్ హోటల్ గేట్ వరకు వచ్చి నిలిచిపోయింది. అనంతరం పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థ టీటీపీ బలం పుంజుకున్నది. ఈ సంస్థను టెర్రరిజం ఫ్యాక్టరీ అని పిలుస్తారు. మలాలా యూసఫ్జాయ్పై జరిగిన దాడికి ఈ సంస్థ బాధ్యత వహించింది. పెషావర్లోని సైనిక్ స్కూల్పై దాడి చేసి 114 మంది పిల్లలను చంపడంలో ఈ సంస్థనే ఉన్నది.