వాషింగ్టన్ : అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ సోమవారం అర్ధరాత్రి (భారత్లో మంగళవారం తెల్లవారుజామున) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలాసవంతమైన ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లిగోలో సోదాలు నిర్వహించింది. దర్యాప్తు ఏజెన్సీ ఏజెంట్లు ట్రంప్ ఇంటిని చుట్టుముట్టగా.. తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎఫ్బీఐ దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మార్-ఎ-లెగోలోని పామ్ బీచ్లోని తన అందమైన నివాసాన్ని ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుందన్న ట్రంప్.. ఇందుకు కారణాలు మాత్రం తెలుపలేదు. దీనిపై, ఎఫ్బీఐ ప్రతినిధిని సంప్రదించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
ఎఫ్బీఐ చర్య రాజకీయ ప్రతీకారమేనని ట్రంప్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడి చేయడం అమెరికాకు ఇది గడ్డు కాలమని పేర్కొన్నారు. అమెరికాలో ఇంతకు ముందు ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు. దర్యాప్తు సంస్థకు సహకారం అందిస్తున్నప్పటికీ.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నివాసంపై దాడి చేశారని ఆరోపించారు. ‘2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఆపాలని కోరుకునే కరుడుగట్టిన డెమొక్రాట్ల దాడి ఇది’ అని ట్రంప్ విమర్శించారు. అయితే, ఎఫ్బీఐ దాడుల సమయంలో ట్రంప్ ఇంట్లో లేదని, ప్రస్తుతం ఆయన న్యూజెర్సీలో ఉన్నట్లు తెలుస్తున్నది.
Read More: ఏంటీ మార్-ఎ-లాగో ఎస్టేట్.. ట్రంప్ అక్కడేమి దాచాడు?