బ్రసెల్స్: ధరల పెరుగుదల, బ్యూరోక్రసీ నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయం వద్ద రైతులు గురువారం నిరసన తెలిపారు. రైతులు ట్రాక్టర్లతో వచ్చి పోలీసులపైకి కోడి గుడ్లు, బాణసంచా విసిరారు. గడ్డి మేట్లను తగులబెట్టడంతో బెల్జియం రాజధాని బ్రసెల్స్లో చాలా ప్రాంతాల ప్రజలు పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భద్రతా దళాలు వాటర్ కెనన్లతో మంటలను ఆర్పివేశాయి.
యూరోపియన్ పార్లమెంటు మెట్లపై పడే విధంగా ఓ చెట్టును నరకడానికి ఓ రైతు చేసిన ప్రయత్నాన్ని బలగాలు విఫలం చేశాయి. ఈ సమయంలోనే కార్యాలయంలో ఈయూ నేతల సమావేశం జరుగుతున్నది. ఈయూలో రైతులు కొన్ని వారాల నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధనం, ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయని, వీటిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. చౌక ధరలకు వ్యవసాయోత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారని, వరదలు, కరువు, వేధిస్తున్నాయని చెప్తున్నారు. వీటన్నిటి వల్ల తమకు తగినంత ఆదాయం లభించడం లేదని మండిపడుతున్నారు.