టెక్సాస్: షూటర్ కాల్పుల్లో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో మృతిచెందిన చిన్నారుల మృతదేహాలు ప్రస్తుతం ఎస్ఎస్జీటీ విల్లీ డీ లియాన్ సివిక్ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ కేంద్రం వద్ద బాధిత బంధువులు తమ పిల్లల భౌతికదేహాల కోసం ఎదురుచూస్తున్నారు. పిల్లల తల్లితండ్రుల నుంచి డీఎన్ఏ శ్యాంపిళ్లను సేకరిస్తున్నారు. కాల్పుల్లో మృతిచెందిన పిల్లలతో ఉన్న రిలేషన్ను తేల్చేందుకు అధికారులు డీఎన్ఏ శ్యాంపిళ్లను తీసుకుంటున్నారు. దీంతో అక్కడ గంటల కొద్ది నిరీక్షణ తప్పడంలేదు. బాధితుల డీఎన్ఏ ఫలితాల కోసం కూడా పిల్లల్ని కోల్పోయినవారు ఎదురుచూస్తున్నారు. 18 ఏళ్ల షూటర్ సాల్వడార్ రామోస్ జరిపిన కాల్పుల్లో 21 మంది మృతిచెందారు. దాంట్లో 19 మంది స్కూల్ పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.
పోప్, జెలెన్స్కీ నివాళి..
టెక్సాస్ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నివాళి అర్పించారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కల్జ్, స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ కూడా మృతుల కుటుంబాలకు నివాళి అర్పించారు. టెక్సాస్ ఘటనతో తన గుండె ముక్కలైనట్లు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. గన్ నియంత్రణ చట్టాలను రూపొందించాలని ఆయన కోరారు. మళ్లీ ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా చూడాలన్నారు. యూరోప్ దేశాలైన స్లోవేకియా, ఐర్లాండ్, ఫిన్ల్యాండ్ కూడా నివాళి అర్పించాయి.