Sanitizer | న్యూయార్క్, మే 14: శానిటైజర్లను అధికంగా వాడుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. రసాయనాల అధిక వాడకం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి బదులు నీరు, సబ్బును వాడుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ తర్వాత శానిటైజర్ల వినియోగం ఎక్కువైన విషయం తెలిసిందే. వీటిపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి, అతి వాడకం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు.
క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్గా పిలుచుకునే యాంటి మైక్రోబయాల్ రసాయనాలను అధికంగా వాడితే రోగాల బారిన పడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధకత పెరగదు సరికదా అనారోగ్యానికి గురవుతారని వెల్లడించారు. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని తెలిపారు. శానిటైజర్లకు బదులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉబ్బసం, చర్మ వ్యాధులకు వీటి వాడకానికి మధ్య సంబంధం ఉన్నట్టు గుర్తించామని వివరించారు.
శాస్త్రవేత్తలు ముందుగా జంతువులపై ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధనల్లో పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లల్లో అవయవ లోపాలు తదితర సమస్యలకు శానిటైజర్లకు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్ యాంటి మైక్రోబయాల్ రోగ నిరోధకతను అడ్డుకుంటాయని 1950ల్లోనే గుర్తించారు. దీని కారణంగా వివిధ వ్యాధులకు విరుగుడుగా వాడే యాంటిబయాటిక్లు పని చేయవు. వీటి వల్ల భవిష్యత్తులో మరణాల సంఖ్య పెరిగే ఆస్కారం ఉన్నదని పరిశోధకులు తేల్చారు.
బెంజల్కోనియమ్ క్లోరైడ్ ఈ కోవకి చెందిన రసాయన పదార్థమే. కాని దీన్ని అమ్మోనియం క్లోరైడ్ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారు. పంట ఉత్పత్తులకు వాడే రసాయనాల లేబుళ్లపై వీటి గురించి ఉంటుంది. రంగుల్లోనూ వీటిని వాడుతున్నప్పటికి డబ్బాలపై వీటి గురించి రాయడం లేదు. సరైన పద్ధతిలో పరీక్షించకుండానే మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ రసాయనాలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని శాస్త్రవేత్తలు సూచించారు.