ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగితే పాకిస్తాన్ మనుగడ కోల్పోయేదని, దేశం పతనమయ్యేదని పాక్ మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ సమావేశంలో సౌదీ రాజు మహ్మద్ బిన్ సుల్తాన్ను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ అసభ్య పంజాబీ పదం వాడారని బజ్వా ఆరోపించారని పాకిస్తాన్ టుడే పేర్కొంది.
జర్నలిస్ట్ జావేద్ చౌధరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బజ్వా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాన్ మంత్రివర్గ సహచరుడు ఒకరు ఈ విషయం పాకిస్తాన్లో సౌదీ రాయబారికి చేరవేశారని చెప్పారు. అయితే ఆ మంత్రి ఎవరనే వివరాలను బజ్వా వెల్లడించలేదు. గత ఏడాది ఏప్రిల్లో ఇమ్రాన్కు ఉద్వాసన పలికిన క్రమంలో నేషనల్ అసెంబ్లీ నుంచి రాజీనామా చేయకుండా ఇమ్రాన్ ఖాన్ను నిలువరించారా అని అడగ్గా బజ్వా బదులిచ్చారు. ఇమ్రాన్..మీరు ఒక మ్యాచ్ మాత్రమే కోల్పోయారు..సిరీస్ ఇంకా మిగిలే ఉందని ఇమ్రాన్ ఖాన్కు తాను చెప్పానన్నారు.
పీటీఐ పార్టీ, పాక్ డెమొక్రటిక్ మూవ్మెంట్ మధ్య పార్లమెంట్లో కేవలం రెండు ఓట్ల మార్జిన్ మాత్రమే ఉండటంతో నేషనల్ అసెంబ్లీ నుంచి రాజీనామా చేయవద్దని తాను ఇమ్రాన్కు సూచించానని అన్నారు. ఇమ్రాన్ తన సూచనకు స్పందిచలేదని చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించగా బజ్వా బదులిచ్చారు. తాను స్వప్రయోజనాలకు పాకులాడితే ఖాన్కు మద్దతుగా నిలిచి గౌరవంగా పదవీవిరమణ చేసేవాడినని, అయితే దేశ ప్రయోజనాల కోసం తాను తన ప్రతిష్టను త్యాగం చేసేందుకే మొగ్గుచూపానని అన్నారు.