ఇస్మైలియా (ఈజిప్ట్): ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? సరిగ్గా 106 రోజుల కిందట సుయెజ్ కాలువలో వెళ్తూ దానికి అడ్డంగా ఇరుక్కుపోయింది. వారం రోజులు ఎలాగోలా కిందామీదా పడి ఆ షిప్ను మళ్లీ కదిలేలా చేశారు. అయితే దాని కోసం అయిన ఖర్చు, ఆ వారం రోజులకు రవాణా ఫీజును కోల్పోవడం వల్ల కలిగిన నష్టాన్ని ఇచ్చిన తర్వాతే నౌకను వదులుతామని ఈజిప్ట్ దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. మొత్తానికి ఆ పరిహారం చెల్లించడానికి నౌక యజమాని అంగీకరించడంతో ఈజిప్ట్ ఆ నౌకను వదిలేసింది. ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్కు చెందిన షూయీ కిసెన్ కైషా లిమిటెడ్. బుధవారం ఈ సంస్ధ కాలువ యాజమాన్యంతో ఓ ఒప్పందానికి వచ్చింది.
దీంతో వంద రోజులకుపైగా నడిచిన డ్రామాకు తెరపడింది. దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైంది. అయితే ఈ సెటిల్మెంట్ తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఈ సెటిల్మెంట్ను ఓ సంబురంగా అక్కడ జరుపుకున్నారు. ఆ తర్వాత ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది. డచ్ పోర్ట్ అయిన రోటెర్డ్యామ్ వైపు వెళ్తూ మార్చి 23న ఈ నౌక సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. దీనిని మళ్లీ దారిలోకి తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున శ్రమించాల్సి వచ్చింది.