Machu Picchu | దక్షిణ అమెరికా దేశమైన పెరూలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా చేపట్టిన జాతీయ సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మచు పిచ్చుకు (Machu Picchu) పర్యాటకులను ప్రభుత్వం అనుమతించడం లేదు. టూరిస్ట్ స్పాట్ అయిన ఈ చారిత్రక ప్రాంతానికి పర్యాటకులు రావడాన్ని నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఆందోళనకారులు మచు పిచ్చుకు వచ్చే రైల్వే లైన్లను ధ్వంసం చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో 417 మంది చిక్కుకుపోయారని చెప్పారు. వారిలో 300 మంది విదేశీయులు ఉన్నారని చెప్పారు. కాగా, ఈ నెల 21, ఆ తర్వాతి రోజుల్లో మచు పిచ్చు సందర్శనకు టికెట్లు బుక్చేసుకున్నవారికి త్వరలోనే డబ్బును తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు.
దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జాతీయ సమ్మె తీవ్ర ఆందోళనకు దారితీసింది. లిమాలోని వరల్డ్ హెరిటేజ్ బిల్డంగ్గా నమోదైన శాన్ మార్టిన్ ప్లాజా సమీపంలో పెద్ద సంఖ్యలో ఆందోళనాకారులు గుమిగూడారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు-ఆందోళనాకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న శాన్ మార్టిన్ భవనంలో మంటలు చెలరేగాయి.
క్రమంగా భవనం అంతా విస్తరించి కార్చిచ్చులా మారింది. ఈ భవనం దాదాపు 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఆందోళనాకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు.
పెరూలో మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లా మద్దతుదారులు – భద్రతా దళాలకు మధ్య కొన్ని నెలలుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తున్నది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు సమాచారం. వీరిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు మూడేండ్లుగా రాజకీయ టెన్షన్ కొనసాగుతున్నది. అవినీతి, బలవంతపు నిర్ణయాల కారణంగా దేశాధ్యక్షుడిగా ఉన్న పెడ్రో కాస్టిల్లా రాజీనామా చేసేలా కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొచ్చింది. కాగా, ప్రస్తుత దేశాధ్యక్షుడు డినా బులెర్టో దిగిపోవాలంటూ గత డిసెంబర్ నుంచి తాజాగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి.