కీవ్: శత్రువు రష్యా తొలి టార్గెట్ తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. రెండో టార్గెట్ తన కుటుంబం అని చెప్పారు. రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్లోకి దూసుకువస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ తాను కీవ్లోనే ఉంటానని తెలిపారు. తన కుటుంబం కూడా కీవ్లోనే ఉందన్నారు. ఉక్రెయిన్ అధినేతను అంతం చేసి దేశాన్ని రాజకీయంగా నాశనం చేయాలని రష్యా కోరుకుంటున్నదని ఆరోపించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని జెలెన్స్కీ విడుదల చేశారు. రష్యాపై పోరాటంలో తాము ఒంటరైపోయామంటూ గురువారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భద్రతపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనతోపాటు ఆ దేశ ప్రజల క్షేమంపై తాము ఆందోళన చెందుతున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మీడియాతో అన్నారు. మరోవైపు ఉక్రెయిన్లో ప్రభుత్వాన్ని పడగొట్టడమే రష్యా ప్రధాన లక్ష్యమని అమెరికా, ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దీని కోసమే కీవ్కు సమీపంలోని చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ను రష్యా సైన్యం గురువారం స్వాధీనం చేసుకున్నదని అన్నారు.