కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆ దేశంలోని భారతీయులు, భారత విద్యార్థుల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం కొత్తగా సూచనలు జారీ చేసింది. ఉక్రెయిన్లో ఇంకా ఉన్న భారతీయులు అత్యవసరంగా ఎంబసీని సంప్రదించాలని కోరింది. తమ మొబైల్ నంబర్ను ఇవ్వడంతో పాటు ఎక్కడ ఉన్నారో అన్నది తెలుపాలని పేర్కొంది. వివరాలను గూగుల్ ఫార్మ్లో నింపి భారత ఎంబసీకి పంపాలని సూచించింది.
కాగా, ఉక్రెయిన్లోని భారత విద్యార్థులను విమానాల్లో తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ గంగా చివరి దశకు చేరింది. దీంతో హంగేరేలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సొంత వసతిలో ఉంటున్న భారత విద్యార్థులు బుడాపెస్ట్లోని చిరునామాకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు చేరుకోవాలని కోరింది. అలాగే ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును సమన్వయం చేయడానికి హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఒక కంట్రోల్ రూమ్ను భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసింది.
మరోవైపు హంగేరి-ఉక్రెయిన్ సరిహద్దులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, 150 కంటే ఎక్కువ మంది వలంటీర్లు తమకు సహాయం అందిస్తున్నారని భారత రాయబార అధికారి రాజీవ్ బోద్వాడే తెలిపారు. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహించే ఆయన హంగేరీలో ప్రత్యేక మిషన్కు డిప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి ఎంత మంది భారతీయులు సరిహద్దులు దాటుతున్నారు, వారికి వసతి, రవాణా వంటి వాటిని పలు బృందాలు పర్యవేక్షిస్తున్నాయని ఆయన వివరించారు.