న్యూయార్క్: ఉక్రెయిన్ యుద్ధంపై టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన అభిప్రాయాల్ని ట్వీట్ చేశారు. ఆ దేశంలో శాంతి నెలకొల్పాలంటే ఏం చేయాలో ఆయన తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. అయితే మస్క్ చేసిన కామెంట్లను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఇటీవల ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఆ సంస్థతో వివాదంలో ఇరుక్కున్న అమెరికా బిలియనీర్ మస్క్.. ఉక్రెయిన్ శాంతి పరిష్కారం కోసం చేసిన ట్వీట్లు మరో వివాదానికి తెరలేపాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి తాను చేసే సూచనలు ఇవే అని మస్క్ కొన్ని ట్వీట్ చేశారు.
రష్యా ఇటీవల నాలుగు ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదాస్పద ప్రాంతాల్లో యూఎన్ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించాలని, అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పును ఇరు దేశాలు ఆమోదించాలని ఓ ట్వీట్లో మస్క్ తెలిపారు. క్రిమియా ప్రాంతాన్ని రష్యా అధికారిక భూభాగంగా గుర్తించాలని, ఆ ప్రాంతానికి నీట సరఫరాను పునరుద్దరించాలని చెప్పారు. ఇక మస్క్ ట్వీట్లు చేసిన వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. మీకు ఈ రెండింటిలో దేన్ని ఇష్టపడుతారని జెలెన్స్కీ ప్రశ్నించారు. మీరు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తారా అని ఓ ప్రశ్న, మీరు రష్యాకు మద్దతు ఇస్తారా అని మరో ప్రశ్న వేశారు.