శాన్ఫ్రాన్సిస్కో : టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కంపెనీకి సైతం తానే చీఫ్ ఎగ్జిక్యూటివ్ వ్యవహరించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ట్విట్టర్ను చేజిక్కించుకున్న అనంతరం సీఈవో పరాగ్ అగర్వాల్తో పాటు కీలక అధికారులను బాధ్యతల నుంచి తొలగించారు. ఈ క్రమంలో సీఈవోగా ఎవరిని నియమిస్తారనే చర్చ జరగ్గా.. తానే సీఈవో కొనసాగనున్నట్లు ప్రపంచ కుబేరుడు స్పష్టతనిచ్చారు. అయితే, మస్క్ ఎంతకాలం సీఈవోగా కొనసాగుతారు? కొత్త మరెవరినైనా నియమిస్తారా? అనే దానిపై స్పందించేందుకు ట్విట్టర్ నిరాకరించింది.
టేకోవర్ ఫలితంగా తానే ట్విట్టర్కు ఏకైక డైరెక్టర్ను అయ్యాయని మస్క్ పేర్కొన్నారు. విలీన సమయానికి ముందు ట్విట్టర్ డైరెక్టర్లుగా ఉన్న బ్రెట్ టేలర్, పరాగ్ అగర్వాల్, ఒమిడ్ కోర్డెస్తానీ, డేవిడ్ రోసెన్బ్లాట్, మార్తా లేన్ ఫాక్స్, ప్రాటిక్ పిచెట్, ఎగాన్ డర్బన్, ఫీ ఫీలి, మిమీ అలెమేహౌ డైరెక్టర్లు కాదని సోమవారం ఓ ఫైలింగ్లో పేర్కొన్నారు. ట్విట్టర్ను కొనుగోలు చేసిన అనంతరం ఎలాన్ మస్క్ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టారు. త్వరలో పెయిడ్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చి బ్లూటిక్ సహా ఇతర అదనపు ఫీచర్లపై ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు 19.99 డాలర్ల చొప్పున వసూలు చేయాలని భావిస్తున్నారు.
నవంబర్ 7లోగా పెయిడ్ వెరిఫికేషన్ను ప్రారంభించాలని, లేకపోతే వెంటనే ఉద్యోగాలను వీడి వెళ్లిపోవాలని ఉద్యోగులకు కొత్త బాస్ ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ట్విట్టర్లో బ్లూటిక్ సహా అదనపు ఫీచర్లను ‘ట్విట్టర్ బ్లూ’ పేరుతో నెలకు 4.99 డాలర్లకే వినియోగదారులకు అందిస్తుండగా.. దీన్ని భారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎలాన్ మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్, బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్, టన్నెలింగ్ సంస్థ బోరింగ్ కంపెనీని నడుపుతున్నారు.