శాన్ఫ్రాన్సిస్కో, నవంబర్ 14: ట్విట్టర్లో ఉద్యోగుల తొలగింపు అంతులేకుండా కొనసాగుతున్నది. ఈ సంస్థను కొనుగోలు చేసిన వారానికే సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కొత్త అధిపతి ఎలాన్ మస్క్.. తాజాగా దాదాపు 4,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు వేసినట్టు తెలుస్తున్నది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వీరిని తొలగించినట్టు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్తో యాక్సెస్ను కోల్పోవడంతో తాము ఉద్వాసనకు గురయ్యామని ఆ కాంట్రాక్టు ఉద్యోగులకు తెలిసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లేఆఫ్లపై ట్విట్టర్ నుంచి గానీ, ఎలాన్ మస్క్ నుంచి గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సాధారణంగా ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సంస్థలు తమ మాధ్యమాల్లో పోస్టయ్యే విద్వేష, హానికర కంటెంట్ను కనిపెట్టేందుకు కాంట్రాక్టర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. దానిలో భాగంగా కంటెంట్ మాడరేషన్ కోసం ఔట్సోర్సింగ్ విభాగాల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకొంటాయి. ట్విట్టర్లో కంటెంట్ మాడరేషన్తోపాటు మార్కెటింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో కంటెంట్ మాడరేషన్ విభాగానికి చెందినవారినే ఎక్కువగా తొలగించినట్టు తెలుస్తున్నది. అదే నిజమైతే ట్విట్టర్లో విద్వేష వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నది.