Elon Musk | టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 500 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా నిలిచారు. టెస్లా షేర్లలో పెరుగుదల, ఇతర టెక్ కంపెనీల విలువల పెరుగుతున్న వేగంగా కారణంగా ఆయన ఈ ఘనతను సాధించాడు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.15 (IST) నాటికి మస్క్ సంపద 500.1 బిలియన్లకు చేరింది. మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లాదే. సెప్టెంబర్ 15 నాటికి టెస్లా షేర్లలో 12.4 శాతానికి పైగా వాటా మస్క్కి ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పటివరకు టెస్లా షేర్లు 14 శాతానికిపైగా పెరిగాయి. బుధవారం మరో 3.3 శాతం పెరగడంతో ఒకేరోజు మస్క్ సంపదకు 6 బిలియన్లకుపైగా వృద్ధి చెందింది.
వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయి. కానీ, ప్రస్తుతం పుంజుకుంటున్నాయి. మస్క్ వ్యాపారంపై మళ్లీ దృష్టి పెట్టడం ప్రారంభించడంతో పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగింది. టెస్లా డైరెక్టర్ల బోర్డు చైర్మన్ రాబిన్ డెన్హోమ్ గత నెలలో మస్క్ ఇప్పుడు కంపెనీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నట్లు తెలిపారు. కొన్ని నెలలు వైట్ హౌస్ సంబంధిత పనుల్లో బిజీగా గడిపిన విషయం తెలిసిందే. మస్క్ దాదాపు బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది టెస్లా భవిష్యత్తుపై బలమైన విశ్వాసాన్ని చూపించింది. కంపెనీ సాంప్రదాయ కార్ల తయారీదారుని దాటి ముందుకు సాగడానికి ఏఐ, రోబోటిక్స్ ప్రపంచంలో ప్రధాన శక్తిగా మారడానికి కృషి చేస్తోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం రెండో బిలియనీర్గా ఒరాకిల్ కోఫౌండర్ లార్రీ ఎలిసన్ నిలిచారు. ఆయన నికర విలువ 351.5 బిలియన్ డాలర్లు.