Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు సొంత చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో అందరినీ షాక్కు గురి చేస్తున్నారు. తాజాగా మస్క్ హాలోవీన్ వేడుకల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఏటా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా జర్మన్- అమెరికన్ మోడల్ హైదీ క్లుమ్స్ సోమవారం రాత్రి న్యూయార్క్లో హాలోవీన్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మస్క్ తన తల్లి మయే మస్క్తో కలిసి హాజరయ్యారు. వేడుకల్లో మస్క్… వైవిధ్యమైన దుస్తుల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
కాగా, పార్టీలో భాగంగా మస్క్ ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజులు తమ సంరక్షణ కోసం ఉపయోగించే రక్షణ కవచం లాంటి ఎర్రటి దుస్తులని మస్క్ ధరించారు. అయితే, ఈ కాస్ట్యూమ్స్ ఖరీదు 7,500 డాలర్లు అని సమాచారం. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.ఆరు లక్షలకు పైమాటే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా లైక్లు, వేలల్లో కామెంట్లు వచ్చాయి.
— Elon Musk (@elonmusk) November 1, 2022