వాషింగ్టన్: తల్లిదండ్రులు ఎవరైనా తమ కన్నబిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వాళ్లకు ఏ లోటు రానివ్వరు. తిండికి లేని నిరుపేదలైనా సరే వారు పస్తులు ఉండి పిల్లల కడుపు నింపుతారు. కానీ, అమెరికాలో నలుగురు పిల్లలను కన్న పేరెంట్స్ మాత్రం తమ బిడ్డలపట్ల అమానుషత్వాన్ని ప్రదర్శించారు. నెలల తరబడి పిల్లలకు సరిపడా ఆహారం పెట్టకుండా, ఇంటి నుంచి బయటికి రాకుండా నిర్భంధించారు. దాంతో ఓ 8 ఏళ్ల బాలిక ఆకలికి తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకింది. మిచాగాన్ (Michigan) రాష్ట్రంలోని కాల్హౌన్ (Calhoun) కౌంటీలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కాల్హౌన్ కౌంటీకి చెందిన ర్యాన్ హార్డ్మాన్, ఎలియో దంపతులకు నలుగురు పిల్లలున్నారు. కానీ, వారు పిల్లలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉంటూ వారి సంరక్షణ బాధ్యతలు మరిచారు. ఆఖరికి పిల్లలకు తిండిపెట్టడం కూడా మానేశారు. దాంతో వాళ్లు మూడు రోజులకో, నాలుగు రోజులకో ఒకసారి పేరెంట్స్ తెచ్చుకుని తినగా మిగిలినవి తింటూ ఆకలితో అలమటించారు. ఈ క్రమంలో ఇటీవల ఆ పిల్లల్లోని ఓ 8 ఏళ్ల బాలిక ఆకలికి తట్టుకోలేక రెండో అంతస్తులోగల తమ ఇంటి కిటికీలోంచి కిందకు దూకింది. దూకినప్పుడు గాయాలు కాకుండా టెడ్డీబేర్ను పట్టుకుని దూకేసింది. ఆ తర్వాత ఆ వీధిలోని దుకాణ సముదాయాల దగ్గరికి వెళ్లి ఆకలి అంటూ అర్థించింది. వాళ్లు పాపకు భోజనం పెట్టి సమస్య
అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అమానుష పేరెంట్స్ను ఎంక్వయిరీ చేసేందుకు వెళ్లగా డ్రగ్స్ మత్తులో కనిపించారు. వారి పిల్లల్లో ఎనిమిదేళ్ల పాప ఎక్కడికెళ్లిందని అడిగితే పైన ఫ్లోర్లలో ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లి ఉంటుందని అబద్ధం చెప్పారు. ఇంట్లో ఆహార పదార్థాలు ఉన్నా వండి పెట్టలేదని గుర్తించారు. అనంతరం ఆ ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆ 8 ఏళ్ల చిన్నారితోపాటు ఆమె ముగ్గురు తోబుట్టువులను కూడా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.