స్టాక్హోం, అక్టోబర్ 10: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు అమెరికన్లను నోబెల్ పురస్కారం వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ ఎస్ బెర్నాంకేతోపాటు మరో ఇద్దరు ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ డిబ్విగ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. బ్యాంకులతోపాటు ఆర్థిక సంక్షోభాలపై విశేష పరిశోధనలు జరపడంతో వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ పురస్కార కమిటీ సోమవారం ప్రకటించింది.
బ్యాంకుల పతనాన్ని నిరోధించడం ఎందుకు ముఖ్యమన్న విషయాన్ని వారు తమ పరిశోధనల ద్వారా వివరించారని పేర్కొన్నది. ఆర్థిక మార్కెట్లను నియంత్రించేందుకు, ఆర్థిక సంక్షోభాల పరిష్కారానికి వీరు 1980వ దశకం ప్రారంభంలోనే పునాదులు వేశారని తెలిపింది. ప్రస్తుతం బెర్నాంకే (68) వాషింగ్టన్ డీసీలోని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్లో, డగ్లస్ డబ్ల్యూ డైమండ్ (68) షికాగో యూనివర్సిటీలో, ఫిలిప్ హెచ్ డిబ్విగ్ (67) సెయింట్ లూయీస్లోని వాషింగ్టన్ యూనవర్సిటీలో పనిచేస్తున్నారు.
1930వ దశకంలో ప్రపంచాన్ని కుదిపేసిన మహా ఆర్థిక సంక్షోభం (గ్రేట్ డిప్రెషన్)పై పరిశోధన జరిపిన బెర్నాంకే.. సంక్షోభ సమయాల్లో మదుపరులు భయాందోళనకు లోనై తమ డిపాజిట్లను ఉపసంహరించుకొంటే బ్యాంకులు ఎలా ప్రమాదంలో పడతాయన్న విషయాన్ని ఆ పరిశోధన ద్వారా విశదీకరించారు.
బ్యాంకు డిపాజిట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభాలను ఎలా నివారించవచ్చన్న విషయాన్ని డైమండ్, డిబ్విగ్ తమ పరిశోధనల ద్వారా వివరించారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఏటా వివిధ రంగాల్లో కృషి చేసినవారికి నోబెల్ పురస్కారాలను అందజేస్తున్న విషయం విదితమే. వాస్తవానికి 1895లో ఐదు రంగాలకే నోబెల్ పురస్కారాలు ఏర్పాటయ్యాయి. వాటిలో ఆర్థిక శాస్త్ర పురస్కారం లేదు. కానీ, ఆయన జ్ఞాపకార్థం స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ 1968లో ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.