బ్రేజావిల్లె: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో)లో విజృంభిస్తున్న ఎబోలా వ్యాప్తిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది. డీఆర్ కాంగోలోని తూర్పు ఇటురి ప్రావిన్స్లో ఇప్పటివరూ 246 అనుమానిత కేసులు, 88 మరణాలు నమోదైనప్పటికీ, ఇది మహ్మమారి స్థాయికి చేరుకోలేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. అయితే ఇది రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎబోలా వ్యాప్తికి ‘బుండి బుగ్యో’ అనే వైరస్ కారణమని, దీని నివారణకు ఎటువంటి మందులు, టీకాలు లేవని ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ వ్యాధి సోకిన వారిలో ప్రాథమికంగా జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తలనొప్పి, గొంతునొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు రావడం, రక్తస్రావం మొదలైనవి జరుగుతాయి. డీఆర్ కాంగో వెలుపలి దేశమైన ఉగాండాలోనూ ఇలీవల మరణించిన 59 ఏళ్ల వృద్ధునికి ఎబోలా పాజిటివ్గా తేలిందని దేశ అధికారులు తెలిపారు.
డీఆర్ కాంగోలో కొనసాగుతున్న భద్రతాపరమైన ఇబ్బందులు, మానవతా సంక్షోభం, ప్రజల అధిక రాకపోకలు తదితర కారణాలతో ఈ వ్యాధి మరింతగా వ్యాపిస్తున్నదని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధి నియంత్రణ, పర్యవేక్షణ, బాధితులను గుర్తించేందుకు వీలుగా డీఆర్ కాంగో, ఉగాండాలు అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డబ్ల్యూ హెచ్వో సూచించింది. నిర్ధారిత కేసులను వెంటనే ఐసొలేట్ చేసి, చికిత్స అందించాలని కోరింది.