మౌమెరి: ఇండోనేషియాలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. మౌమెరికి 95 కిలోమీటర్ల ఉత్తరంలో భూకంపం కేంద్రీకృతమైంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.6గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలను ఇండోనేషియా జారీ చేసింది. యురోపియన్-మెడిటరేనియన్ సెసిమాలజికల్ సెంటర్ భూకంప తీవ్రతను 7.7గా అంచనా వేసింది. ఫ్లోరేస్ సముద్రంలో సుమారు 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. తెల్లవారుజామున 3. 20 నిమిషాలకు భూకంపం వచ్చింది. అయితే భూకంప కేంద్రం నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రమాదకరమైన సునామీ తరంగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది.