అంకారా: వారం రోజులక్రితం భారీభూకంపం తుర్కియే, సిరియాలను కోలుకోలేని దెబ్బతీసింది. భూకంపం దెబ్బకు వేల సంఖ్యలో భవనాలు నేలమట్టయ్యాయి. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తుర్కియేలో మరోసారి భూమికంపం వచ్చింది. ఆదివారం తుర్కియే దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్లో 4.7 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
కాగా, తుర్కియే, సిరియాలో భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివరకు 34 వేల 179 మంది మరణించారు. ఇందులో తుర్కియేలో 29,605 మంది ఉండగా, సిరియాలో 4,574 మంది ఉన్నారు. భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అక్కడక్కడ కొందరు ప్రణాలతో బయటపడుతున్నారు. 92 వేల మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే భూకంపాల మృతుల సంఖ్య 50వేలు దాటవచ్చని ఐక్యరాజ్య సమితి సహా య కార్యక్రమాల విభాగాధిపతి మార్టిన్ గ్రిఫిత్స్ తెలిపారు.
ఇక భూకంపంతో కష్టాల్లో ఉన్న ఇరు దేశాలకు ప్రపంచం బాసటగా నిలిచింది. పలు దేశాలు వైద్య పరికరాలు, డాక్టర్లను పంపిచాయి. 10 వేల క్యాబిన్లు, క్యారావ్యాన్లను అందించడానికి ఖతార్ ముందుకు వచ్చింది. గతేడాది ఫుట్బాల్ ప్రపంకప్ సందర్భంగా ఉపయోగించిన క్యాబిన్లను తుర్కియే, సిరియాలకు పంపిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ ప్రటించింది. వీటివల్ల ఇండ్లు కోల్పోయినవారికి తాత్కాలికంగా ఉపశమనం కల్పించవచ్చని వెల్లడించింది.