దుబాయ్: విమానం గాల్లో ఎగురుతుండగా అందులో ప్రయాణించిన ఒక మహిళ బిడ్డను ప్రసవించింది. ఎమిరేట్స్ విమానంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 19న గర్భిణీ అయిన ఒక మహిళ జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నరిటా నుంచి దుబాయ్కు ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించింది. 12 గంటల విమాన ప్రయాణంలో ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఎమిరేట్స్ విమాన సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర వైద్య సహాయం అందించారు. ఈ నేపథ్యంలో విమానం గాల్లో ఉండగా ఆ మహిళ బిడ్డను ప్రసవించింది.
కాగా, ఎమిరేట్స్ సంస్థ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపింది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పటికీ విమానం నిర్ణీత సమయానికే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్లు చెప్పింది. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. తమ సిబ్బంది, ప్రయాణీకుల ఆరోగ్యం, భద్రత తమకు చాలా ముఖ్యమని ఎమిరేట్స్ సంస్థ పేర్కొంది.