ఆల్మటి: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో కజకిస్తాన్ అట్టుడుకుతోంది. అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ బిల్డింగ్లను టార్గెట్ చేస్తూ నిరసనకారులు ఉద్యమించారు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీసు కాల్పుల్లో.. డజన్ల సంఖ్యలో ఆందోళనకారులు మరణించినట్లు తెలుస్తోంది. ఆల్మటి నగరంలో ఈ ఘటన జరిగినట్లు మీడియా పేర్కొన్నది. అయితే కజకిస్తాన్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ దేశం రష్యా సహాయాన్ని కోరింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు అదుపు చేసేందుకు కలెక్టివ్ సెక్యూర్టీ ట్రీటీ ఆర్గనైజేషన్ మద్దతు ఇవ్వాలని అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ పిలుపునిచ్చారు. పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఆ నిరసనలు రాజకీయ పరిణామాలకు దారి తీశాయి. విదేశాల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులే ఈ నిరసనలకు పాల్పడుతున్నట్లు అధ్యక్షుడు తొకయేవ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సామూహిక సమావేశాలను రద్దు చేశారు. కజకిస్తాన్ పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించారు. సుమారు 353 మంది గాయపడినట్లు తెలుస్తోంది.