న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ను సొంతం చేసుకున్న తాలిబన్లను ప్రస్తుత పరిస్థితుల్లో అస్సలే తక్కువ అంచనా వేయొద్దని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత విలియం డాల్రింపుల్ హెచ్చరించారు. తాలిబన్లు పాకిస్థాన్ నుంచి నిధులు, శిక్షణ, ఆశ్రయం పొందారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే తాలిబన్లు వారికి ఆపన్నహస్తం అందించిన పాకిస్థాన్ నుంచే విముక్తికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తంచేశారు.
అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలనే అమెరికా నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమని ‘రిటర్న్ ఆఫ్ ఏ కింగ్: ది బ్యాటిల్ ఫర్ అఫ్గానిస్థాన్’ పుస్తక రచయిత విలియం డాల్రింపుల్ అభిప్రాయపడ్డారు. తనది హేతుబద్ధమైన నిర్ణయమని అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ముఖ్యంగా అమెరికా విదేశీ విధానంలో గత వందేళ్లలో జరిగిన వ్యూహాత్మక తప్పిదాల్లో ఆఫ్ఘన్ అంశమే అతిపెద్దదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాలిబన్లది పాకిస్థాన్ ప్రేరేపిత ఉద్యమంగా కొందరు వ్యూహకర్తలు/రచయితలు భావించడం సరైనది కాదని విలియం డాల్రింపుల్ స్పష్టంచేశారు. అది కచ్చితంగా ఆఫ్ఘన్ ఉద్యమమేనని, అయితే, వారికి నిధులు, ఆయుధాలు సమకూర్చడం, శిక్షణ, ఆశ్రయం కల్పించడం పాకిస్థాన్ చేసిందని చెప్పారు. గత 25 ఏండ్లుగా తాలిబన్లకు పాకిస్థాన్ నుంచి మద్దతు కొనసాగుతున్న మాట వాస్తవమేనన్నారు. తాలిబన్ల స్వయంప్రతిపత్తిని కొందరు తక్కువ అంచనా వేస్తున్నారని, ప్రస్తుతం వారి చేతిలోనే అధికారం ఉన్నందున ఇంతకాలం వారికి యజమానిగా ఉన్న పాకిస్థాన్ నుంచే విముక్తి కోరే అవకాశాలు లేకపోలేదని విలియం డాల్రింపుల్ పేర్కొన్నారు.