న్యూఢిల్లీ, డిసెంబర్ 9: వాణిజ్య చర్చల్లో పురోగతి పెద్దగా కనిపించని నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యం, కెనడా నుంచి దిగుమతి అవుతున్న ఎరువులపై కొత్త సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. వైట్హౌస్లో రైతు ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. అమెరికన్ రైతులకు వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్.. భారత్, ఇతర ఆసియన్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై విమర్శలు గుప్పించారు.
దేశీయ ఉత్పత్తుదారులకు ఈ దిగుమతులు పెను సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్.. అమెరికన్ రైతులను రక్షించుకునేందుకు భారీ స్థాయిలో దిగుమతి సుంకాల విధింపే పరిష్కారమని అభిప్రాయపడ్డారు.వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వసూలు చేస్తున్న సుంకాల ద్వారా వచ్చే ఆదాయం నుంచే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందచేయనున్నట్లు ఆయన చెప్పారు. సుంకాల ద్వారా లక్షల కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తున్నట్లు ఆయన తెలిపారు. బియ్యం దిగుమతులపై ఈ సమావేశంలో జరిగిన సుదీర్ఘ చర్చలో భారత్ ప్రధాన ఉదాహరణగా ప్రస్తావనకు వచ్చింది.
భారత్ బియ్యం దిగుమతులు దక్షిణ అమెరికన్ రైతుల పాలిట శాపంగా మారినట్లు లూసియానా రైతు ట్రంప్ ఎదుట వాపోయాడు. అమెరికన్ రిటైల్ మార్కెట్లోని రెండు పెద్ద బ్రాండ్లు భారతీయ సంస్థలకు చెందినవని కొందరు రైతులు చెప్పగా ఆ విషయాన్ని తాము చూసుకుంటామని, మళ్లీ సుంకాలు విధిస్తే రెండు నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుందని, భారత్ నుంచి భారీ మొత్తంలో బియ్యం దిగుమతి కావడం ఆమోదనీయం కాదని ఆయన చెప్పారు.