న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అయిదు యుద్ధ విమానాలు కూలినట్లు ట్రంప్ వెల్లడించారు. రిపబ్లికన్ ప్రతినిధులతో జరిగిన డిన్నర్ భేటీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఏ దేశ యుద్ధ విమానాలు కూలిపోయానన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఇది నమ్మలేరు, గాలిలోనే విమానాలను పేల్చేశారు. అయిదో నాలుగో.. నాకు తెలిసి అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారని ట్రంప్ ఆ మీటింగ్లో అన్నారు.
#WATCH | Washington, D.C.: US President Donald Trump says, “We stopped a lot of wars. And these were serious, India and Pakistan, that was going on. Planes were being shot out of there. I think five jets were shot down, actually. These are two serious nuclear countries, and they… pic.twitter.com/MCFhW406cT
— ANI (@ANI) July 18, 2025
ట్రంప్ ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందన్న ఉద్దేశం పరోక్షంగా వ్యక్తం అవుతున్నది. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత.. మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య అతి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్ చెబుతోంది. దాంట్లో మూడు ఫ్రెంచ్ నిర్మిత రఫేల్ ఫైటర్లతో పాటు రెండు సుఖోయ్లు ఉన్నట్లు పేర్కొంటున్నది. భారతీయ పైలెట్లను కూడా పట్టుకున్నట్లు పాకిస్థాన్ చెబుతున్నా.. దానికి సంబంధించిన ఆధారాలను మాత్రం ఆ దేశం బహిర్గంతం చేయలేదు.
యుద్ధ విమానాల కూల్చివేత అంశంలో భారత్ తొలుత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇటీవల త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారతీయ వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ చెబుతున్నట్లు ఆరు విమానాలను కోల్పోలేదన్నారు. అయితే సంఖ్యను మాత్రం ఆయన కూడా వెల్లడించలేదు. సంఖ్య ముఖ్యం కాదు అని, ఎందుకు.. ఎలా వాటిని కూల్చేశారు, ఆ తర్వాత ఎలా తిప్పికొట్టామన్న అంశాన్ని ఆలోచించాలన్నారు.
రఫేల్ యుద్ధ విమానాలను కోల్పోలేదని భారత్ మాత్రం పదేపదే స్పష్టం చేస్తున్నది. భారతీయ పైలెట్లను కూడా ఎవరూ బంధించలేదన్నది. పాకిస్థాన్ చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని రఫేల్ కంపెనీ చైర్మెన్ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. మూడు రఫేల్స్ కూల్చివేశామని పాకిస్థాన్ చెబుతున్న విషయంలో నిజం లేదని ఆయన అన్నారు. వాస్తవం బయటకు వచ్చినప్పుడు ఆ నిజం మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుందన్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరగడానికి తానే కారణమని ట్రంప్ మళ్లీ చెప్పారు. ఎన్నో యుద్ధాలను ఆపామని, అవి చాలా సీరియస్ యుద్ధాలు అని, భారత్..పాకిస్థాన్ మధ్య కూడా యుద్ధం జరిగిందని, అవి రెండూ న్యూక్లియర్ దేశాలని, కొత్త తరహా యుద్ధం జరిగిందని, ఇటీవల ఇరాన్లో యుద్ధాన్ని ఆపిన విషయం తెలిసిందే, అయితే అదే రీతిలో భారత్, పాక్ కూడా సమరానికి వెళ్లాయని, కానీ గొడవ పెద్దగా కాకుండా వాణిజ్యం ద్వారా యుద్ధానికి బ్రేక్ వేశామన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇండియా కొట్టిపారేసింది. ద్వైపాక్షికంగా ఆ సమస్యను చర్చించుకున్నట్లు భారత్ చెప్పింది.