Donald Trump : భారత్ (India) పై అమెరికా (USA) భారీ సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల బలహీనపడ్డాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ని పొగిడినట్టే పొగిడి, అతడి తీరు నచ్చలేదని వ్యాఖ్యానించారు.
ట్రంప్ శుక్రవారం వైట్హౌస్లో సీఈవోలకు ఇచ్చిన విందు సందర్భంగా మాట్లాడుతూ.. భారత్, రష్యాలకు దూరమయ్యాం అంటూ తన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై శనివారం మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, అది తనను చాలా నిరాశకు గురిచేసిందని చెప్పారు.
రష్యా చమురు కొనుగోలు చేయవద్దని భారత్కు తాను చెప్పానని, అయినా వెనక్కి తగ్గకపోవడంతో భారత దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్లు విధించానని ట్రంప్ తెలిపారు. అయితే తాను భారత్పై విధించిన 50 శాతం సుంకాలు చాలా ఎక్కువేనని ఆయన అంగీకరించారు. ప్రధాని నరేంద్రమోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు.
‘భారత్తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారా..?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘కచ్చితంగా’ అని ట్రంప్ బదులిచ్చారు. ‘నేను ఎప్పుడూ అదే కోరుకుంటా. ప్రధాని మోదీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటా. ఆయన గొప్ప ప్రధాని. కానీ.. ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్-అమెరికా దేశాల మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది. దీనిపై ఆందోళన అవసరం లేదు’ అని చెప్పారు.
ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించిన విషయాన్ని కూడా ట్రంప్ గుర్తుచేశారు. శుక్రవారం ఆయన ట్రూత్ సోషల్లో.. ‘భారత్, రష్యాలను అమెరికా కోల్పోయింది. అవి రెండూ చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయి’ అని పేర్కొన్నారు. ఆ పోస్టుతోపాటు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు కలిసి ఉన్న ఫొటోను కూడా ట్రంప్ పంచుకున్నారు. ఆ మూడు దేశాలు సుదీర్ఘ, సుసంపన్న భవితవ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యంగ్య కామెంట్స్ చేశారు.