న్యూయార్క్: వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump).. తాజాగా మరో నిర్ణయాన్ని వెల్లడించారు. స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. స్వదేశీ స్టీల్ పరిశమ్రను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం నిర్ణయం వల్ల స్థానిక స్టీల్ పరిశ్రమకు ఊతం వస్తుందని, జాతీయ సరఫరా పెరుగుతుందని, దీంతో చైనాపై ఆధారపడే సందర్భాలు తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా స్టీల్ పరిశ్రమ అభివృద్ధి కోసం 14 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. జపాన్కు చెందిన నిప్పాన్ స్టీల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ డీల్కు చెందిన తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉందన్నారు. స్టీల్ పరిశ్రమలో ఇక నుంచి ఉద్యోగులు తీసివేత ఉండదని, ఔట్ సోర్సింగ్ కూడా ఉండదన్నారు. ప్రతి స్టీల్ పరిశ్రమ కార్మికుడికి 5 వేల డాలర్ల బోనస్ అదనంగా వస్తుందని ట్రంప్ చెప్పారు.
నిప్పాన్ స్టీల్తో ఒప్పందం కుదుర్చుకోనున్న నేపథ్యంలో అమెరికా స్టీలల్ పరిశ్రమ ఉద్యోగులు పేమెంట్, హైరింగ్ అంశంలో ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికా స్టీల్ను రక్షించినట్లు ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికాలోని అతిపెద్ద స్టీల్ పరిశ్రమ పిట్స్బర్గ్లో ఉన్నది. 2018లో తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు టారిఫ్ను 25 శాతానికి ట్రంప్ పెంచారు. సుంకాన్ని 50 శాతానికి పెంచడం అంటే, అమెరికా ఉక్కు పరిశ్రమను ఆదుకోవడమే అని ట్రంప్ వెల్లడించారు.