వాషింగ్టన్: భారత్, పాకిస్థాన్ మధ్య గత ఏడాది యుద్ధ వాతావరణం నెలకొన్నదని, ఆ సంక్షోభాన్ని తానే పరిష్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. ఒకవేళ యుద్ధాన్ని ఆపకపోతే, 200 శాతం వాణిజ్య పన్ను విధించనున్నట్లు ఆ రెండు దేశాలను బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. బోర్డ్ ఆఫ్ పీస్ ఈవెంట్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఇండియా, పాకిస్థాన్ సమరం వేళ సుమారు 11 యుద్ధ విమానాలు కూలినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఇండియా వరుసగా ఖండిస్తూనే ఉన్నది. పాక్తో జరిగిన సంధి వేళ.. మూడవ దేశ జోక్యం లేదని భారత్ పేర్కొన్నది. ఆ సంక్షోభ సమయంలో యుద్ధ విమానాలు కూలలేదని కూడా భారత్ వెల్లడించింది.
బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్లో మాట్లాడిన ట్రంప్.. తన ప్రసంగంలో వేళ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కొంత సేపు నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇతర దేశాల నేతలు కూడా పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం చర్చల గురించి వివరిస్తూ ట్రంప్ మరోసారి ఇండోపాక్ సంక్షోభాన్ని లేవనెత్తారు. ఇండియా, పాక్ మధ్య భీకర వార్ జరిగిందని, కానీ ఆ యుద్ధాన్ని తన టారిఫ్ బెదిరింపుల ద్వారా ఆపేసినట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా మూడు కోట్ల మంది ప్రాణాలు కాపాడినట్లు పాక్ ప్రధాని తనను ప్రశంసించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా తనకు మంచి మిత్రుడుని, కానీ భారత్, పాక్ యుద్ధం చేయాలని భావించాయని,అయితే ఆ రెండు దేశాలను టారిఫ్తో బెదిరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ మీరు ఇలాగే పోరాడితే అప్పుడు మీపై 200 శాతం పన్ను విధిస్తానని హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు. పన్ను విధిస్తామని బెదిరించగానే డబ్బు గురించి వెనుకడుగు వేశారని, డబ్బును మించిందని లేదని, డబ్బును కోల్పోవాల్సి వస్తే అప్పుడు తాము యుద్ధం చేయలేమన్నారని, ఆ ఫైట్లో 11 యుద్ధ విమానాలు కూలాయని, చాలా ఖరీదైన జెట్స్ ఉన్నట్లు ట్రంప్ తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో జెట్స్ కూలిన అంశంలో ట్రంప్ తన సంఖ్యను పెంచుతూ పోతున్నారు. ఇప్పటికే ఈ అంశం గురించి సుమారు 80 కన్నా ఎక్కువ సార్లు మాట్లాడారు. తొలుత 5 , ఆ తర్వాత 7, ఇప్పుడు ఏకంగా 11 యుద్ధ విమానాలు కూలినట్లు ట్రంప్ చెప్పారు. ఇంతకీ ట్రంప్ వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందో స్పష్టంగా తెలియడంలేదు. భారత్ మాత్రం డీజీఎంవో స్థాయి చర్చలతోనే ఆ యుద్ధానికి బ్రేక్ వేసినట్లు చెప్పింది.
#WATCH | At the Board of Peace Event, US President Donald Trump says, “…He (Pakistani PM) said in front of our Chief of Staff that President Trump saved 25 million lives when he stopped the war between us and India…That war was raging. Planes were being shot down. And I got… pic.twitter.com/pm5eT7xjz3
— ANI (@ANI) February 19, 2026