వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురయ్యారు. ఉటాకౌంటీలోని ఉటా యూనివర్సిటీలో (Utah University) ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన చార్లీ కిర్క్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు.
కన్జర్వేటివ్ రాజకీయ కార్యకర్త, రచయిత, వక్త అయిన చార్లీ కిర్క్.. అమెరికాలో మాస్ షూటింగ్స్ అనే అంశంపై ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన చర్చా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు ఆయన బదులిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఆయనను దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. కిర్క్ మెడ భాగంలో తుపాకీతో కాల్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది.
కాగా, చార్లీ మృతిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అంటూ సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు చేశారు. అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్నవారు ఎవరూ చేసుకోలేరని పేర్కొన్నారు. రాజకీయ హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కిర్క్ మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. సంతాపంగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అమెరికా అంతటా జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. అయితే నిందితుడు తమ అదుపులోనే ఉన్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు.
US President Donald Trump posts, “The Great, and even Legendary, Charlie Kirk, is dead. No one understood or had the heart of the youth in the United States of America better than Charlie. He was loved and admired by ALL, especially me, and now, he is no longer with us. Melania… pic.twitter.com/nrGUL5l1gq
— ANI (@ANI) September 10, 2025
చార్లీ కిర్క్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిర్క్ 1993, అక్టోబర్ 14న అర్లింగ్టన్ హైట్స్ (ఇల్లినాయ్)లో జన్మించారు. 2012లో తన 18వ ఏట యువతను లక్ష్యంగా చేసుకుని టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ (Turning Point USA) అనే కన్జర్వేటివ్ సంస్థను స్థాపించారు. దీనిద్వారా విద్యార్థుల్లో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్రీ మార్కెట్లు, లిమిటెడ్ గవర్నమెంట్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. ‘ప్రూవ్ మీ రాంగ్’ (Prove Me Wrong) అనే డిబేట్ టేబుల్ ద్వారా కాలేజీ క్యాంపస్లలో ప్రత్యక్ష చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హత్యకు గురయ్యారు. కాగా, తొలి నుంచి అమెరికన్ ఫస్ట్ భావజాలం వ్యాప్తిచేస్తున్న ఆయన.. ఈ మధ్యకాలంలో ‘అమెరికా ఈజ్ ఫుల్’ అంటూ భారతీయ వలసదారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
GRAPHIC CONTENT ⚠️⚠️⚠️
Close up of the moment #CharlieKirk was shot pic.twitter.com/cwl0Cd6Eiw— Nia Nacci (@naughtynianacci) September 10, 2025