న్యూయార్క్, డిసెంబర్ 24: ఎర్ర సముద్రంతో పాటు, అరేబియా సముద్రంపై యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ రెచ్చిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అరేబియాలో భారత్కు వస్తున్న నౌకపై శనివారం ప్రయోగించిన డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరికా రక్షణ శాఖ పేర్కొన్నది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ నేరుగా నౌకలను లక్ష్యంగా చేస్తున్నట్టు అమెరికా ఆరోపిస్తున్నది. తాజాగా శనివారం రెండు వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులకు తెగబడ్డారు. అందులో భారత జాతీయ పతాకంతో వస్తున్న ముడి చమురు ట్యాంకర్ నౌక కూడా ఉన్నట్టు తొలుత అమెరికా పొరపడి ప్రకటన చేసింది. దీంతో పాటు మరో నౌకపై కూడా దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీలు దాడి చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఎర్రసముద్రంలోని అంతర్జాతీయ జలాలపై హౌతీ రెబల్స్ యెమన్ భూభాగం నుంచి రెండు యాంటీ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని తెలిపింది. అయితే ఓడలకు ఎలాంటి నష్టం కలగలేదని పేర్కొంది. ఎంవీ సాయిబాబా పేరుతో భారత్లో రిజిస్టరైన గబాన్కు చెందిన చమురు ట్యాంకర్ వస్తుండగా దాడి జరిగింది. అలాగే ఎంబీ బ్లామెనన్ పేరుతో కెమికల్, ఆయిల్ ట్యాంకర్ నార్వేజియన్ జెండాతో వస్తున్నది. మరోవైపు అరేబియాలో వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఘటనపై భారత నేవీ దర్యాప్తు ప్రారంభించింది.