కొలంబో, జూలై 22: పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు నూతన ప్రధానిగా దినేశ్ గుణవర్ధన నియమితులయ్యారు. శుక్రవారం ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. గొటబయ రాజపక్స కుటుంబానికి గుణవర్ధన్ అత్యంత సన్నిహితుడు. గత రాజపక్స ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అంతేగాక ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, గుణవర్ధన కొన్ని ఏండ్ల నుంచి రాజకీయ ప్రత్యర్థులు. అయితే ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి అధ్యక్షుడు రణిల్, ప్రధాని గుణవర్ధన కలిసి నడుస్తున్నారు. ప్రధానితోపాటు నూతన మంత్రివర్గం కూడా కొలువుదీరింది. గత ప్రభుత్వంలో కీలక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అలీసబ్రీ ప్రస్తుతం విదేశాంగశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆర్థికశాఖను తనవద్దే ఉంచుకోవాలని అధ్యక్షుడు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
భారత స్వాతంత్య్ర పోరాటంలో గుణవర్ధన తల్లిదండ్రులు
నూతన ప్రధాని దినేశ్ గుణవర్ధనకు భారత మూలాలున్నాయి. ఆయన తండ్రి ఫిలిప్, తల్లి కుసుమ రెండో ప్రపంచయుద్ధం సమయంలో శ్రీలంక నుంచి భారత్కు వచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో వీళ్లు పాల్గొన్నారు. తర్వాత బ్రిటిష్ సైనికులు వీళ్లను అరెస్టు చేసి ముంబైలోని ఆర్థర్ జైలులో ఉంచారు. అనంతరం శ్రీలంక జైలుకు పంపారు. యుద్ధం ముగిసిన తర్వాత విడుదల చేశారు. శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చాక ఫిలిప్, కుసుమ ఎంపీలుగా ఎన్నికయ్యారు. అలా గుణవర్ధనకు భారత్తోనూ అనుబంధం ఉన్నది. అంతేగాక జయప్రకాశ్ నారాయణ్, వీకే క్రిష్ణ మీనన్తో గుణవర్ధన కలిసి చదువుకున్నారు.