India-Bangladesh : భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో వివాదం తలెత్తింది. బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ సన్నిహితుడు, ఆయన సలహాదారుడు అయిన జాహెద్ ఉర్ రెహమాన్ను న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండు గంటల విచారణ తర్వాత దేశంలోకి అనుమతించారు. అయితే, ఆయన ఢిల్లీ వెళ్లకుండా.. తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. ఈ పరిణామంపై బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢాకాలోని భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు జారీ చేసింది. భారత్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈ నెల 15, 16 తేదీల్లో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) మీటింగ్ జరగాల్సి ఉంది.
దీనికి బంగ్లాదేశ్ నుంచి అధికార ప్రతినిధిగా ఆ దేశ ప్రధాని తారిక్ సన్నిహితుడు జాహెద్ ఉర్ రెహమాన్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు నిలిపివేశారు. దీంతో ఉన్నతాధికారుల జోక్యం తర్వాత ఆయనను ఇండియాలోకి అనుమతించారు. కానీ, తనను ఎయిర్పోర్టులో ఆపడంపై ఆగ్రహం చెందిన జాహెద్ ఉర్ రెహమాన్ ఇండియాలోకి అడుగుపెట్టకుండా.. శ్రీలంకలోని కొలంబో చేరుకుని, అక్కడినుంచి బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై సోమవారం బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ బంగ్లాదేశ్లోని భారత డిప్యూటీ రాయబారి పవన్ బాదెకు సమన్లు జారీ చేసింది. ఈ ఘటనపై బంగ్లా విదేశాంగ మంత్రి ఖలియుర్ రెహమాన్ మాట్లాడుతూ.. జాహెద్ను విమానాశ్రయంలో నిలిపివేయడం సరికాదన్నారు. దీన్ని అనూహ్య, దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు.
అయితే, జాహెద్ పర్యటనపై అంతకుముందే భారత అధికారులకు బంగ్లా రాయబార కార్యాలయం వివరాలు అందించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనను అడ్డుకోవడంపై బంగ్లా అసంతృప్తితో ఉంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయమివ్వడంపై ఆ దేశం అసంతృప్తితో ఉంటే.. అక్కడ హిందువులపై దాడులు, పలు హిందూ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాస్త మార్పు వచ్చినట్లు కనిపించినా.. ఇంకా సంబంధాలు పూర్తిగా బలపడలేదు.