వాషింగ్టన్, నవంబర్ 30: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం తీవ్ర ఒత్తిడిలో ఉన్నదని, పతనం వైపు పయనిస్తున్నదని అమెరికాకు చెందిన ఓ మేధోసంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. భారత్, అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఐడియా) సెక్రటరీ జనరల్ కెవిన్ కాసస్ జమోరా తెలిపారు. చాలా ప్రజాస్వామ్య దేశాల్లో రోజురోజుకూ పాలకుల నిరంకుశత్వం పెరిగిపోతుండటంతో ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతున్నదని ఇటీవల ఐడియా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.
నివేదికలోని అంశాలు
‘ఎన్నికల విశ్వసనీయత సవాళ్లను ఎదుర్కొంటున్నది. చట్టం సవాళ్లను ఎదుర్కొంటున్నది. పౌర సమాజం నిర్బంధాలకు గురవుతున్నది. కరోనా సంక్షోభంతోపాటు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుండటంతో రాజకీయ వ్యవస్థ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నది’.
– కెవిన్ కసస్ జమోరా, ఐడియా సెక్రటరీ జనరల్