కాబూల్: పైన ఉన్న ఫొటో చూశారు కదా. మన దగ్గర బస్సుల్లోకి, రైళ్లలోకి ఇలా ఎక్కడం చూశాం. కానీ ఓ విమానంలోకి కూడా ఇలా వేల మంది ఎగబడి ఎక్కడానికి ప్రయత్నించడం ఎక్కడైనా చూశారా? కానీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) రాజధాని కాబూల్లో ఉన్న దుస్థితికి అద్దం పట్టే ఫొటో ఇది. దేశం ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. సైన్యం చేతులెత్తేసింది. అధ్యక్షుడు రాజీనామా చేసి మరో దేశానికి పారిపోయారు. దీంతో ఆఫ్ఘన్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తాలిబన్ల రాజ్యం ఉండలేమంటూ వేల మంది దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం ఉదయం కాబూల్ ఎయిర్పోర్ట్కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అక్కడ ఉన్న ఒక్క విమానంలోకే ఎక్కడానికి ఇలా వేల మంది ఎగబడ్డారు.
ఇంత భారీగా తరలి వస్తున్న జనాలను నియంత్రించ లేక అక్కడి మిగిలిపోయిన కొంత మంది అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. ఆదివారం ఉదయమే కాబూల్లోకి దూసుకొచ్చిన తాలిబన్లు సాయంత్రానికి రాజధానిని తమ ఆధీనంలోకి తీసుకొని ఆఫ్ఘన్ అధ్యక్ష భవనాన్ని కూడా ఆక్రమించిన విషయం తెలిసిందే. గతంలో తాలిబన్ల భయానక పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు మళ్లీ వాటిని ఊహించుకుంటూ భయాందోళనలతో దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తమ సరిహద్దులను మూసేసింది.