భారత దేశంలో మాజీ ప్రధాని నెహ్రూ వార్తల్లో నానుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనపై విమర్శలు చేస్తూనే వున్నారు. ఇది ఓ పక్కన నడుస్తుండగానే.. సింగపూర్ పార్లమెంట్లో నెహ్రూ ప్రస్తావన రావడం ఆశ్చర్యం. ‘దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన ఎలా నడవాలి?’ అన్న అంశంపై సింగపూర్ ప్రధాని లీసీన్ లూంగ్ చర్చ లేవనెత్తారు. ఈ సందర్భంగానే భారత ప్రప్రథమ ప్రధాని నెహ్రూను ఆయన ఉటంకించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని మాట్లాడుతూ…
‘చాలా మట్టుకు దేశాలన్నీ గొప్ప గొప్ప ఆదర్శ భావాలు, ఉన్నతమైన వ్యక్తిత్వాలను ఆధారంగా చేసుకొనే ఏర్పడతాయి. దాని జైత్రయాత్రను ప్రారంభిస్తాయి. అయితే యాత్ర ప్రారంభంలో ఏ సిద్ధాంతాలు, ఆదర్శాలను పెట్టుకుంటాయో.. ఎప్పటికీ వాటి ప్రయాణం ఆ సిద్ధాంతాల ప్రాతిపదికగానే నడవదు. మెళ్లి మెళ్లిగా… పక్కకు జరగడం ప్రారంభమవుతుంది. స్వాతంత్రం కోసం పోరాడే వ్యక్తులు ఎప్పుడు కూడా ధైర్య సాహసాలనే కలిగి వుంటారు. ఉత్కృష్టమైన సంస్కృతిని కలిగి వుంటారు. అత్యంత ఓపికతో మెలుగుతారు. ఇలాంటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న వారే ఉంటారు. స్వాతంత్ర పోరాటంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ తర్వాత ప్రజల మధ్యలో నాయకునిగా ఎదుగుతారు. భారత మాజీ ప్రధాని నెహ్రూ ఈ కోవలోని వారే’ అంటూ సింగపూర్ ప్రధాని లీసీన్ లూంగ్ అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నెహ్రూ ఓ దిశను చూపించారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే సమయాన్ని వెచ్చించారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో నెహ్రూ పాత్రను ఎవరూ కాదనలేరని సింగపూర్ ప్రధాని లూంగ్ తేల్చి చెప్పారు.
ప్రపంచమంతా మెచ్చుకుంటోంది… : కాంగ్రెస్
సింగపూర్ ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. నెహ్రూను ప్రపంచమంతా మెచ్చుకుంటోందని, ఇప్పటికీ ప్రపంచ స్థాయి నేతలకు నెహ్రూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని పేర్కొంది. దురదృష్టమేమిటంటే నెహ్రూ ఎంత గొప్ప నాయకుడో అర్థం చేసుకునే దృక్పథం లేకపోవడం బాధాకరమని పరోక్షంగా ప్రధాని మోదీపై విరుచుకుపడింది.