Dell : ఇరాన్ ప్రభుత్వం (Iran Govt) తనను ఉగ్రవాద సంస్థ (Terrorist Group) గా ప్రకటించడంపై అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ డెల్ (Dell) స్పందించింది. తన ఉద్యోగుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ అంతర్గతంగా ట్రావెల్ అడ్వయిజరీ జారీచేసింది. ఉద్యోగులెవరూ ఇరాన్కు వెళ్లవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. ఇరాన్ సంస్థలు లేదా ఆ దేశ వ్యక్తులతో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష వ్యాపార లావాదేవీలు పెట్టుకోవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా కంపెనీ డేటా, నెట్వర్క్ భద్రతపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని డెల్ తన ఐటీ విభాగాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ ఘర్షణ ఇప్పుడు క్షిపణుల నుంచి గ్లోబల్ టెక్నాలజీ, ఫైనాన్స్ సంస్థల వైపు మళ్లినట్టుగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన 18 ప్రముఖ కంపెనీలు తమ హిట్ లిస్టులో ఉన్నాయని ఐఆర్జీసీ తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్పష్టంచేసింది. ఈ ఐటీ సంస్థలన్నీ అమెరికా నిఘా వర్గాలకు సమాచారాన్ని చేరవేస్తున్నాయని ఆరోపించింది.