ఇస్తాంబుల్: తుర్కియే భూకంపంలో మృతుల సంఖ్య 4372కు చేరుకున్నది. తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం తుర్కియేలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయపడ్డవారి సంఖ్య 15,834గా ఉన్నట్లు పేర్కొన్నది. సిరియాలో భూకంపం వల్ల సుమారు 1451 మంది మరణించారు. మరో 3531 మంది గాయపడ్డారు.
తుర్కియేలో ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. వరుసగా మూడు భారీ భూకంపాలతో ఆ దేశం అతలాకుతలమైనట్లు అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు. తుర్కియేలో సుమారు 185 సార్లు భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఖరమన్మారస్ కేంద్రంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. రెండో కంపం 7.7 తీవ్రతతో, మూడవది 7.6 తీవ్రతతో సంభవించినట్లు అధికారులు తెలిపారు.
తుర్కియేలో వచ్చిన భూకంపం వల్ల గ్రీన్ల్యాండ్లో కూడా ప్రకంపనలు నమోదు అయినట్లు డెన్మార్క్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. 1999లో వచ్చిన 7.4 తీవ్రత భూకంపం తర్వాత ఇదే పెద్ద కంపమని ఇస్తాంబుల్ అధికారులు వెల్లడించారు. ఆ ఏడాది వచ్చిన భూకంపంలో 17వేల మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణ తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అమెరికా, భారత్తో పాటు చాలా వరకు దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి.